అంత్యేష్టి గోష్ఠి
*అంత్యేష్టి గోష్టి*
*శైవ సాంప్రదాయంలో లింగసమాధి తత్వం*
*వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే । జగతః పితరౌ వందే పార్వతీపరమేశ్వరౌ!!*
*మాకు శాంభవ దీక్ష అనుగ్రహించిన కైలాస వాస్తవ్యులు పరమ పూజ్యులు మా గురుదేవులు శివశ్రీ నిర్మల శంకర శాస్త్రి గారి చరణారవిందములకు శరణులు*
శైవ సాంప్రదాయం అనేది కేవలం ఒక భక్తి మార్గం కాదు. ఇది ఒక సంపూర్ణ జీవన శాసనం..
ఇందులో శివుని ఆరాధన మాత్రమే కాక జీవితపు ప్రారంభం నుండి సమాప్తి వరకు శాస్త్రబద్ధమైన..ఆత్మీయమైన.. తత్త్వపూరితమైన విధానం ఏర్పడింది.. ముఖ్యంగా లింగధారణ నుండి లింగైక్యం వరకు సాగే ఈ మార్గంలో మరణానంతరం నిర్వహించబడు ఖనన విధానం (లింగసమాధి), మహేశ్వర శ్రాధ్ధం..మహేశ్వరార్చన వంటి అంశాలకు శాస్త్ర ప్రామాణికత ఉంది..
*లింగధారణము - శివపథానికి ప్రతిజ్ఞ*
లింగాన్ని ధరించటం అనేది శివునికి మనచే సమర్పణ..ఇది సాధారణ ఆచారం కాదు. శైవ ఆగమాల ప్రకారం..
*లింగధారణం శివపథమప్రాప్త్యర్థం* (కామికాగమం)
అంటే శివుని పధంలో ప్రవేశించేందుకు చేసే తొలి సంకల్పం..లింగాన్ని ధరించిన తరువాత శరీరం శివుని ఆలయంగా పరిగణించబడుతుంది.
*లింగధారి శరీరం - శివస్వరూపం*
తిరుమూల నాయనార్ రచించిన *తిరుమంతిరం* అనే తమిళ గ్రంథంలో ఇలా చెప్పబడింది.
*దేహశ్చ ప్రాణశ్చ శివైక్యభావః, స శరీరం శివస్వరూపతాం యాతి!!*
అంటే లింగధారి శరీరమూ, ప్రాణమూ ఒకటై శివుని స్వరూపంగా మారుతాయి. ఆ శరీరం ఇక శివుని స్థిర నివాసంగా మారుతుంది.
*లింగధారి ఖననం - శాస్త్ర ఆదేశం*
శ్రౌత శైవతత్త్వంలో లింగాన్ని ధరించిన మరణానంతరం దహనం చేయరాదు. కామికాగమం పేర్కొంటుంది..
*లింగధారిణాం న దహనమ్, ఖననమేవ శిష్యతే।* (కామికాగమం – చర్యా పాదం)
అంటే లింగధారుల శరీరాన్ని దహించరాదు. ఖననం చేయడం శాస్త్రబద్ధంగా ఆదేశించబడింది.
ఈ ఖననం చేసే విధానాన్ని *లింగసమాధి* అంటారు. శరీరానికి లింగాన్ని పెట్టి శ్రౌత శైవ సాంప్రదాయంగా భూమిలో సమాధి చేసి శివలింగాన్ని ప్రతిష్ఠిస్తారు.
మనకు ప్రత్యక్ష నిదర్శనంగా శివయోగి ముదిగొండ శంకరారాధ్యుల సమాధి..
అక్కడే శివలింగాన్ని ప్రతిష్టించి నిత్యం పూజిస్తుండడం చూస్తున్నది..
మహోన్నతుల సమాధులు ఎన్నో కాలగర్భంలో కలిసిపోయినవి..
లింగసమాధి - ముక్తి సాధన గమ్యం
లింగసమాధి అంటే శివునిలో లీనమవడం..ఇది ముక్తి యొక్క అత్యంత శ్రేష్ఠ స్థితి.. మరణించగానే కైలాస ప్రాప్తి..
లింగసమాధి మాత్రమే లింగధారికి అనుగుణమైన అంతిమ గమ్యమైన ఆచరణ.. దీనిని శ్రౌతశైవ సంప్రదాయయంలో ముఖ్యమైన ఆచారంగా భావిస్తారు.
లింగధారి ముక్తిని పొందుటచే సాధారణ పితృకర్మలు అవసరం ఉండవు..మృత్యుంజయ సూత్రం చెబుతోంది:
*యస్య లింగధారిణః శిష్యస్య ముక్తిర్విదితా భవేత్। న తస్మై పితృకర్మాణి కుర్యాత్ మహేశ్వర పూజయేత్॥*
అంటే ముక్తి సాధించిన లింగధారికి పితృశ్రాధ్ధం చేయకూడదు..అతనిని మహేశ్వరునిగా పూజించాలి.
శ్రౌత శైవ ఆరాధ్య బ్రాహ్మణుల లింగ సమాధులు
శైవ తత్త్వానికి ప్రామాణిక సాక్షాలు..
శైవ తత్త్వములో లింగధారణ శివైక్య ప్రయాణపు తొలి పాదం..
లింగసమాధి ముక్తిగమ్యం మహేశ్వర శ్రాధ్ధం.. మహేశ్వరార్చన భక్తుని శివరూపతను తెలియచేసే పూజా క్రతువు..
శివునిలో లీనమవడం అనేది అత్యున్నత పురుషార్ధం..
*శివభక్తో యదా కాయం త్యజతి లింగవానభిః। న స పునర్జన్మ లభేత్ మదీయః సతతః శివః॥*
అంటే..లింగాన్ని ధరించి శివుని భజిస్తూ శరీరం వదిలిన భక్తుడు పునర్జన్మ పొందడు..అతడు శివుని రూపమే అవుతాడు.
శైవతత్వం శాస్త్రప్రామాణికమైన.. తత్త్వగంభీరమైన..పరమార్థ ప్రయాణమైన మార్గం..ఇది జీవితమంతా స్వరూప పరిపక్వతకు, శివైక్యానికి పునాది వేస్తుంది. లింగసమాధి అనే తాత్త్విక స్థితి శుద్ధమయ శివస్వరూపతను ఆమోదించే శాశ్వత స్థితికి నిదర్శనం..
ఓం నమః శివాయ ॥
భవదీయుడు
శ్రీపతి పండితారాధ్యుల సతీష్ చంద్రశర్మ
Comments
Post a Comment